18 నెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

18 నెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ 18 నెలల్లోనే 59 వేల ఉద్యోగాలను ఇచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​ చెప్పారు. కోరుట్లకు మంత్రి మొదటి సారి రాగా సాయిబాబా ఆలయం వద్ద శనివారం కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కోరుట్ల బస్టాండ్​వద్ద అంబేద్కర్ విగ్రహానికి జువ్వాడి నర్సింగరావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇటీవల వినాయక విగ్రహ తయారీ కేంద్రం వద్ద ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​కు గురై మృతి చెందిన అల్వాల వినోద్​, వెల్లుట్ల సాయి కుటుంబాలను పరామర్శించారు.  విద్యుత్​ శాఖ నుంచి మంజూరైన రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్​సత్యప్రసాద్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. . 

హరీశ్ రావు ఆరోపణలు హాస్యాస్పదం  

కార్యకర్తల ఆత్మీయ సన్మాన సభలో మంత్రి అడ్లూరి ప్రసంగించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక12 వేలకు మించి జాబ్ లు ఇవ్వలేదని మాజీ మంత్రి హారీశ్ రావు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014  నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఎన్ని జాబులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ..  బీఆర్‌‌ఎస్‌ హయంలో కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన అవినీతిని సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ను కాంగ్రెస్​ శ్రేణులు ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ర్ట నాయకులు జువ్వాడి కృష్ణారావు,  కొమిరెడ్డి విజయ్​ఆజాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.