- మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, వెలుగు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. మంత్రితోపాటు జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కర్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ హాస్పిటల్లో మరో 50 బెడ్స్ అదనంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో భవిష్యత్లో పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పఠాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్లు, లీడర్లు పాల్గొన్నారు.

