కేసీఆర్ ని దేవుడు అని ఇప్పుడు దయ్యమంటున్నాడు

కేసీఆర్ ని దేవుడు అని ఇప్పుడు దయ్యమంటున్నాడు
  • మంత్రి గంగుల కమలాకర్ 

కరీంనగర్: పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ను దేవుడు అని పొగిడిన ఈటల రాజేందర్ ఇప్పుడు దయ్యమని తిడుతున్నాడని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈటల రాజీనామాపై స్పందించిన ఆయన వీ6-వెలుగుతో  ప్రత్యేకంగా మాట్లడారు. ఏడేళ్లుగా తనది బానిస బతుకు అంటున్న ఈటల అదే రోజు ఎందుకు రాజీనామా చేయలేదని మంత్రి గంగుల నిలదీశారు. సీఎం దగ్గరకు వెళ్లాలంటే అపాయిమెంట్ తీసుకోకుండా వెళ్తే పోలీసులు ఆపడం సహజంగానే జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలు సీఎంవో లేరంటున్న  ఈటల ఏడేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 
‘‘ప్రభుత్వ పథకాలను తప్పుపడుతున్న ఈటల.. ఇంతకాలం నేరుగా ఎందుకు సీఎంకు చెప్పలేదు.. ఈటల రాజేందర్ ది ఆత్మగౌరవం కాదు.. ఆత్మరక్షణ.. ఇంతకాలం బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను నల్లచట్టాలన్న ఈటల.. ఇప్పుడవి తెల్లచట్టాలేలా అయ్యాయో చెప్పాలి.. బీజేపీలో చేరడానికి ఈటలకు నడ్డా ఏం హామీ ఇచ్చారో చెప్పాలి.. బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటివాళ్లు ఈటలను పార్టీలో తీసుకునే ముందు పునరాలోచించాలి..’’ అని మంత్రి గంగుల సూచించారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల... తన ఆధీనంలో ఉన్న పేదల భూములు ఎందుకు స్వాధీనం చేయలేదో చెప్పాలన్నారు. ‘‘సీఎం నన్ను అడగలేదంటున్న ఈటల ఎందుకు తొందరపడి కేసీఆర్ పై విమర్శలు చేసారు. నీపై వచ్చిన ఆరోపణలపై రాజ్యాంగ పదవి నుంచి నిన్ను తప్పించారు తప్ప పార్టీ నుంచి తొలగించలేదు కదా. ఎందుకు తొందరపడి విమర్శలు చేసారు. 40 ఎకరాలు భూములు కొన్నట్లు ఈటల రాజేందరే ఒప్పుకున్నాడు. మంత్రివై ఉండి అసైన్డ్ భూములు ఎలా కొన్నారు.? ఆత్మగౌరవం కోసం మీరు మాట్లాడవద్దు. ఓ బీసీ ఎమ్మెల్యే గెలిస్తే ఓర్వలేని మీరు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడవద్దు..’’ అని మంత్రి గంగుల సూచించారు. 
హుజురాబాద్ ఎన్నికల్లో మేమే గెలుస్తాం-మంత్రి గంగుల
ఈటల రాజేందర్ ఇంతకాలం టీఆర్ఎస్ లో ఉన్నందువల్లే గెలిచారని, కారు గుర్తుపై ఎవరిని నిల్చోబెట్టినా హుజురాబాద్ నుంచి గెలుస్తారని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు. మోడీ హవా నేపథ్యంలోనే కవిత ఓడిపోయారని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేడా ఉంటుంది అని మంత్రి గంగుల కమలాకర్ విశ్లేషించారు.