దుబ్బాకలో నైతిక విలువలు మంటగలిపేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని విమర్శించారు. 18 ప్రశ్నలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు లేఖ రాశారు హరీశ్ రావు. తన లేఖకు సంజయ్ సమాధానం చెబుతారని ఆశిస్తున్నానన్నారు.
14 అంశాలతో చార్జిషీట్ వేస్తే ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించారని.. లోయర్ సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏపీకి అప్పగించిందన్నారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ పెట్టకుండా కేంద్రం మోసం చేస్తున్నదని, నీటి పంపకాలు చేయకుండా అన్యాయం చేస్తున్నారన్నారు మంత్రి హరీశ్.