మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఫస్ట్: మంత్రి హరీష్ రావు

మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఫస్ట్: మంత్రి హరీష్ రావు

మాతా శిశు సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా రూ.52 కోట్లతో నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందులో భాగంగా 33 నియోనాటల్ అంబులెన్స్‌లను, రూ.1.2 కోట్లతో ఆధునీకరించిన డైట్ కిచెన్‌ను ప్రారంభించుకోవడం అభినందనీయమని చెప్పారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఎంసీహెచ్ బ్లాక్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. 

తెలంగాణ ప్రభుత్వం 3 మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌(ఎంసీహెచ్‌) నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మాత శిశు మరణాలు తగ్గించడంలో ప్రస్తుతం తెలంగాణ ముందుందన్నారు మంత్రి హరీష్ రావు.

టిమ్స్‌ పరిధిలో భాగంగా ఒకటి నిమ్స్‌లో, రెండోది అల్వాల్‌లో, మూడోది గాంధీ నిర్మిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మొత్తం 600 పడకలు మాతా శిశు సంరక్షణ కోసం అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ మూడు సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ హాస్పిటల్స్‌లో మాతా, శిశువులకు అన్ని రకాల మల్టీపుల్‌ వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. ప్రసవం సమయంలో, ఆ తర్వాత.. మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు.. అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలు ఈ ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో అందుతాయన్నారు.

గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్‌ వ్యాధులతో బాధపడే తల్లులకు..  పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.