గండిపేట,వెలుగు : ప్రజలు తమ పరిసరాల శుభ్రతతో పాటు పర్యావరణాన్ని సైతం రక్షించు కోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ(ఈపీటీఆర్ఐ) ఈఐఏసీపీ, రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు(టీఎస్బీడీబీ), ధృవాన్ష్ సంస్థ సహకారంతో మణికొండ మున్సిపల్ నెక్నంపూర్ చెరువు వద్ద శుక్రవారం చిత్తడి నేలల దినోత్సవం నిర్వహించారు.
చీఫ్గెస్టుగా మంత్రి కొండా సురేఖ హాజరై నెక్నంపూర్ చెరువు వద్ద మానవ నిర్మిత అతిపెద్ద ఫ్లోటింగ్ బర్డ్ ఐలాండ్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఇందులో చిత్తడి నేలలు, జీవవైవిధ్యం ప్రాముఖ్యత, మానవ శ్రేయస్సుకు కమ్యూనిటీలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిత్తడి నేలల వాక్, మానవ సంక్షేమంపై పోస్టర్ పోటీ, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్, జీవవైవిధ్యంపై ఫొటో ఎగ్జిబిషన్, మేరీ లైఫ్(పర్యావరణానికి జీవనశైలి) థీమ్పై స్వాగత నృత్యం అలరించాయి.
ప్లాంటేషన్ డ్రైవ్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు చిత్తడినేలల మిత్రలో చేరాలని, వ్యర్థాలు, ప్లాస్టిక్లు డ్రైనేజీల్లో వేయకుండా చిత్తడి నేలలను రక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఎ.వాణి ప్రసాద్, రాష్ట్ర జీవవైవిధ్య మండలి కార్యదర్శి కాళీచరణ్ ఎస్.ఖర్తాడే, రంగారెడ్డి కలెక్టర్ కె.శశాంక, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.