- టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ బలోపేతం కోసం తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నుంచి లక్షన్నర మంది రైతులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టి ఇప్పటి వరకు 9 విడతల్లో రూ.57,882 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ నెలాఖరు నుంచి ఇంకో రూ.7,600 కోట్లు పంపిణీ చేయనున్నారు” అని కేటీఆర్ తెలిపారు. ‘‘రైతు బీమాతో ఇప్పటి వరకు 94 వేల రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4,700 కోట్ల ఇన్సూరెన్స్ చెల్లించాం. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు మిషన్ కాకతీయ చేపట్టి 27,625 చెరువులు పునరుద్ధరించాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కాళేశ్వరం లాంటి కొత్త ప్రాజెక్టులు నిర్మించి సజీవ సాగునీటి క్షేత్రంగా తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్దే. ప్రభుత్వం ఉచిత కరెంట్ కోసం ఏటా రూ.10,500 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోంది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ క్లస్టర్ ఏర్పాటు చేసి 2,601 రైతు వేదికలు నిర్మించాం” అని కేటీఆర్ అన్నారు.
సింగరేణి కార్మికులకు కేటీఆర్, కవిత విషెస్
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు, కార్మికులకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత విషెస్ చెప్పారు. ‘‘సింగరేణిని సిరుల గనిగా తీర్చిదిద్ది లోకానికి వెలుగును పంచే నల్ల సూరీళ్లకు, సంస్థకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా కార్మికులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
రైతాంగ స్వర్ణ యుగానికి బాటలు వేశాం: కేసీఆర్
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ రైతాంగ స్వర్ణ యుగానికి బాటలు వేశామని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ కిసాన్ దివస్ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిక్కింలో 16 మంది జవాన్లు మృతి చెందడంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.