
మిడ్ మానేరు జంక్షన్ అయ్యిందంటే భూ నిర్వాసితుల త్యాగ ఫలితమే అన్నారు మంత్రి కేటీఆర్. ఏప్రీల్ 10వ తేదీ సోమవారం కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్.. చీర్లవంచ గ్రామంలో ఇప్పటి వరకూ రూ.12 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.
తెలంగాణకు మిడ్ మానేరు జంక్షన్ అయ్యిందంటే కోదురు పాక,చీర్లవంచ గ్రామాలు, ఇతర గ్రామాల భూ నిర్వాసిత ప్రజల త్యాగ ఫలితమే అన్నారు. 350 ఎకరాలలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని కేటీఆర్ చెప్పారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి హబ్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
చీర్లవంచ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తామని.. అలాగే జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో దళితులలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకు దళితబంధు కార్యక్రమం తీసుకొచ్చామని కేటీఆర్ వెల్లడించారు. చీర్లవంచ గ్రామంలో దశల వారీగా దళితబంధును వర్తింపజేస్తామన్నారు.
అంతేకాదు గృహ లక్ష్మీ కార్యక్రమం కింద ప్లాట్ ఉండి ఇళ్లు లేని వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు కేటీఆర్. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు రాని వారినీ గుర్తించి అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రూ. 10 కోట్లతో రెండు నెలల్లో చీర్లవంచ గ్రామం నుండి సిరిసిల్ల వరకూ రోడ్డుకు మరమ్మతులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.