కేసీఆరే యువత‌కు ఆద‌ర్శం : ఏపీ తో బాగున్నాం, రాష్ట్రం కోసం రాజీ ప‌డం

కేసీఆరే యువత‌కు ఆద‌ర్శం : ఏపీ తో బాగున్నాం, రాష్ట్రం కోసం రాజీ ప‌డం

కృష్ణా జలాలు, తమ చట్ట బద్ధ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామ‌ని అన్నారు మంత్రి కేటీఆర్. ఆస్క్ కేటీఆర్ అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న..కృష్ణ జ‌లాల పై త‌మ‌ పోరాటం కొనసాగుతుందని, ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పేషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో తమకు సత్సంబంధాలున్నాయ‌ని , కానీ రాష్ట్ర హక్కుల పైన ఎలాంటి రాజీ ఉండబోదని స్ప‌ష్టం చేశారు.

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం

క‌రోనా వైర‌స్ ట్రీట్మెంట్ పేరుతో పెద్ద ఎత్తున ఛార్జీలు వ‌సూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న కేటీఆర్.. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల సేవ‌ల్ని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని కోరారు. క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌కు ట్రీట్మెంట్ అందించేందుకు ప్రైవేట్ ఆస్ప‌త్రులు నిరాక‌రించినా స‌రే వారిని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో నాణ్య‌మైన ట్రీట్మెంట్ అందిస్తున్న‌ట్లు చెప్పారు. అందుకే ప్రభుత్వ వైద్యసిబ్బంది సేవలకు ప్రజలు మరింత గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలోనే క‌రోనా రిక‌వ‌రీ రేటు ఎక్కువే

దేశంలో అత్యుత్త‌మ క‌రోనా రిక‌వ‌రి రేటు న‌మోద‌వుతుంద‌న్నారు కేటీఆర్. రాష్ట్రంలో సుమారు 1200 పైగా సెంటర్లలో కరోనా టెస్టింగ్ జరుగుతుందని, కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉంద‌న్నారు.

కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో పైన వస్తున్న వ్యతిరేక ప్రచారమే కాకుండా ఆ సంస్థలు చేస్తున్న సేవలు కూడా గుర్తించాలని, ఇప్పటికే వేలాది మందికి చికిత్స అందించి ఇంటికి సురక్షితంగా పంపించారన్నారు.

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం సందర్భంగా వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇది కేవలం తెలంగాణకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చినాక శిశు, మాత మరణాలు తగ్గించగలిగాం

తెలంగాణ వచ్చినాక అనేక రకాల కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో శిశు, మాత మరణాలు తగ్గించగలిగామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐదు నూతన మెడికల్ కాలేజ్ లను ప్రారంభించడంతో పాటు పలు ఏరియా ఆసుపత్రిలో ఐ సియూ యూనిట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. 40కిపైగా డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

సీఎం కేసీఆరే యువతకి ఆద‌ర్శం

కేసీఆరే యువతకి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆదర్శమని కేటీఆర్ అన్నారు. చదువుకున్న విద్యావంతులు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని, ముఖ్యంగా చదువుకున్న యువత సైలెన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని అన్నారు.

కేంద్రం అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి

రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ లు, మెట్రోరైల్ వంటి సేవలు అందుబాటులోకి రావాలంటే కేంద్రం అనుమ‌తి త‌ప్ప‌ని స‌రిఅన్నారు. కేంద్రం అనుమతికోసం ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా..ఆరోగ్య‌శ్రీ అత్యుత్త‌మ‌మైంది

కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని, నిజానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు.

త్వరలోనే ఎలిమినేడు ఏరోస్పేస్ పార్క్ కి శంకుస్థాపన

గ్రామీణ ప్రాంతాల డిజిటలైజేషన్ పైన కూడా స్పందించిన కేటీఆర్.. ఫైబర్ గ్రిడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మరో సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

రామ‌రాజ్య‌మే మ‌న‌కు కావాల్సింది

అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి స్పందించారు. భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల,మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి లభించే రామ రాజ్యం రావాలన్న కోరికను ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాలే మా ల‌క్ష్యం

తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు కల్పించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.

మా ఫోకస్ అంతా రాష్ట్రం పైనే ఉంది

రాష్ట్రాభివృద్ధే మంత్రంగా ప‌ని చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆస్క్ కేటీఆర్ కార్య‌క్ర‌మంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే జ‌రుగుతుంద‌న్న ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న‌ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టి వారితో పని చేయిస్తూ వాటిని సమీక్షిస్తున్నామని త్వరలోనే మంచి ఫలితాలు చూస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు