హైదరాబాద్, వెలుగు: మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తమ ప్రాంతంలోని చెరువుల అక్రమ తవ్వకాలను మంత్రి మల్లారెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ బొక్కా సంగీతా ప్రభాకర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాలకు పాల్పడేవారికి మంత్రి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. తవ్వకాలను అడ్డుకున్న తనను, తన భర్తను ఇష్టమొచ్చినట్లు దూషిస్తున్నారని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.
పరమేశ్వర్నగర్ కాలనీలో ఉన్న చెరువు ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్)లోనే ఎస్.రామ్నాథ్, ఇతరులు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. వారిని గత సెప్టెంబర్ 27న జరిగిన సమావేశంలో మల్లారెడ్డి బహిరంగంగా సమర్థించారని వెల్లడించారు. నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఆఫీసర్లు ఎవరూ అడ్డుకోకూడదని మంత్రి హుకుం జారీ చేసినట్లు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేసినందుకు తనతోపాటు తన భర్తను కూడా బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి అండతో జరిగే అక్రమ నిర్మాణాల నిలిపివేతకు ఉత్తర్వులివ్వాలని హైకోర్టును సంగీత కోరారు.