
- ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ సిబ్బంది
- ఏపీలో ‘థాంక్యూ సీఎం’ పేరిట వేడుకలు
అమరావతి, వెలుగు: ఏ రాష్ట్రంలో లేని రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కొనియాడారు.‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యంకాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడి కార్మికులకు తేల్చి చెప్పారు. మన్ను కూడా కాదంటే మేము చేసి చూపించాం’ అని ఆయన అన్నారు. అనుభవం కంటే సంకల్ప బలం గొప్పదని జగన్ నిరూపించారన్నారు.ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం సందర్భంగా విజయవాడ డిపోలో ఏర్పాటు చేసిన ‘సీఎం జగన్కు కృతజ్ఞత సభ’లో నాని మాట్లాడారు. బుధవారం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని చెప్పారు. సీఎం జగన్ 54 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. జనవరి 1 వ తేదీ నుంచి ఏపీ ఆర్టీసీలో ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, రవాణా శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో వాళ్లు డ్యూటీ చేస్తారని ఏపీ సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు బుధవారం నుంచి విలీన నిర్ణయం అమల్లోకి రావడంతో ఏపీలోని 128 బస్ డిపోల్లో ఉద్యోగులు థాంక్యూ సీఎం పేరుతో సంబురాలు చేసుకున్నారు.