ఇకపై సహించేదే లేదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లపై మంత్రి పొంగులేటి సీరియస్

ఇకపై సహించేదే లేదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లపై మంత్రి పొంగులేటి సీరియస్

వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం (మే 29) హనుమకొండ కలెక్టరేట్‎లో 6 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్షం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 

ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా లబ్ధిదారుల లిస్ట్  ప్రకటించకపోవడం ఏంటి అని నిలదీశారు. లబ్ధిదారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని.. జూన్ 6లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. 2025, జూన్ 6 కటాఫ్ డేట్‎గా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని సూచించారు. 

పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం చూస్తుంటే.. మీ సొంత అభిప్రాయాలతో లబ్ధిదారుల జాబితా తయారు చేయడంలో జాప్యం చేయడం సరికాదని కలెక్టర్లకు చురకలంటించారు. సీఎం, మంత్రులు రెగ్యులర్‏గా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం పనిలేక కాదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కనీసం 50 శాతం కూడా లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.

Also Read : నిండా నిండిన జూరాల ప్రాజెక్టు.. 12 గేట్లు ఎత్తివేత

ఒక్కో కలెక్టర్ పరిధిలో ముగ్గురికి మించి ఎమ్మెల్యేలు లేరు.. అయినా ఎందుకు సమన్వయం చేసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పోస్టింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకోవడం కలెక్టర్లకు సరికాదని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదని మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.