
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చండ్రుగొండ/అన్నపురెడ్డిపల్లి/ములకపల్లి/మదిర/సత్తుపల్లి/కల్లూరు/తల్లాడ, వెలుగు: తెలంగాణలో గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకపల్లిమదిర, సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో ఆయన ఎంపీ రఘరాంరెడ్డి, కలెక్టర్ జితేశ్, ఐటీడీఏ పీవో రాహుల్తోపాటు స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి పర్యటించారు. పలు చోట్ల ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రానున్న మూడున్నర ఏండ్ల లో రాష్ట్రం లో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 9 రోజుల నుంచి రూ.9 వేల కోట్ల నిధులు రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతా లో జమ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఎట్లా ఉన్నా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రతీ సోమవారం బిల్లులు చెల్లిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. భూ భారతి ద్వారా ప్రతీ భూ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలు తీరును ను వివరించారు. కాగా, పలుచోట్ల బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. మంత్రి వెంట టీజీ ఐడీసీచైర్మన్ మువ్వా విజయబాబు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.