
- స్వదేశం చేరాలని ఏడేండ్లుగా ఆరాటం
- స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, వెలుగు: సౌదీ అరేబియాలోని ఎడారిలో ఖర్జూరాలను పండించే తోటలో తాళ్లపల్లి ఈశ్వర్ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఏడేండ్లుగా అక్కడే చిక్కుకుని స్వదేశం రాలేక ఇబ్బంది పడుతున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ కి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్ కోసం 2017 మేలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. మొదట హౌస్ డ్రైవర్గా పనిచేశాడు. కొద్ది నెలల్లోనే పని కోల్పోయి నిరాశ్రయుడయ్యాడు. తన బిడ్డల భవిష్యత్ కోసం ఖర్జూర తోటలో కూలీగా చేరి అక్కడే చిక్కుకుపోయాడు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి సహకారంతో ఈశ్వర్ భార్య లత, ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్ ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' కౌంటర్ లో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ను వేడుకుంటూ వినతిపత్రం అందజేశారు.
విషయం తెలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జీఏడీ ఎన్నారై అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అఖామా, వీసా గడువు ముగిసిపోయి, పాస్ పోర్ట్ సౌదీ అధికారులు జప్తు చేయడం వల్ల ఈశ్వర్ స్వదేశానికి రావడం సమస్యగా మారిందని, కరీంనగర్కు చెందిన సామాజిక కార్యకర్త మొహమ్మద్ జబ్బార్ సహాయాన్ని ఆర్థించామని లత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి ఈశ్వర్ను స్వదేశానికి రప్పించాలని లత విజ్ఞప్తి చేశారు.