
నర్సంపేట, వెలుగు: కుల గణన చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపించామని.. అందువల్లే స్థానిక సంస్థల ఎన్నికలు కొంత ఆలస్యం అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో మంగళవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కొంత మంది కావాలని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. వంద శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అనంతరం తాటి వనంలో గీత కార్మికులతో మాట్లాడారు. గీత కార్మికులు ఇచ్చిన ముంజల రుచి చూశారు.