చేవెళ్ల ఘోరంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి.. రాంగ్ రూట్లో టిప్పర్ రావడం వల్లే ప్రమాదం

చేవెళ్ల ఘోరంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి.. రాంగ్ రూట్లో టిప్పర్ రావడం వల్లే ప్రమాదం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరగడం వెనుక ఉన్న కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. కంకర లోడుతో ఉన్న టిప్పర్ రోడ్డు రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. తక్షణమే ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 18 మంది మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంగా దూసుకొచ్చి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును ఢీ కొట్టింది. బస్సు సగ భాగంలోకి టిప్పర్ దూసుకెళ్లడంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది.

కంకరలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను స్థానికులు, పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే ఊపిరాడక కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం ఇంత మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.