బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తా : మంత్రి పువ్వాడ అజయ్

బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తా : మంత్రి పువ్వాడ అజయ్

బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తా 

రేవంత్ మతిభ్రమించి మాట్లాడుతున్నడు : మంత్రి అజయ్

ఖమ్మం, వెలుగు : ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టాలనుకునే బీజేపీకి బీఆర్ఎస్​వ్యతిరేకమని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​అన్నారు. యూనిఫామ్​ సివిల్ కోడ్​ బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్​ ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ తమకు ప్రధాన శత్రువని, ఆ పార్టీతో బీఆర్ఎస్​ కలిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలోని వీడీవోస్​ కాలనీ క్యాంప్​ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి ఉన్న భారత సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీఆర్​ఎస్ సెక్యులర్ భావాలను గౌరవిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వదిలిన రుగ్మతలే ఈ దేశానికి ఇబ్బందిగా మారాయని, ఇంకా పట్టిపీడిస్తున్నాయన్నారు. ఎన్డీఏ చట్టాలను కాంగ్రెస్ ఎందుకు అడ్డుకోవడం లేదో చెప్పాలన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకోవాలని  డిమాండ్​ చేశారు. ఖమ్మంలో మతతత్వ పార్టీలకు చోటు లేదన్నారు. రేవంత్ అమెరికాలో మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, గాంధీ భవన్ లో దూరిన గాడ్సే రేవంత్ రెడ్డి అని ఫైర్​ అయ్యారు. ‘ప్రభుత్వానికి విద్యుత్ ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు ముడుపులు ఇస్తాయా? కనీసం ఈ సంగతి కూడా తెలియకుండా పీసీసీ అధ్యక్షుడివి ఎలా అయ్యావు’ అని మంత్రి పువ్వాడ విమర్శించారు.