హైదరాబాద్, వెలుగు : కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. చేవెళ్ల సభలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను దేశ వ్యాప్తంగా అమలు చేస్తారా చెప్పాలన్నారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీలో ఆమె మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా స్కీంలను అమలు చేసిన తర్వాతే తెలంగాణలో వాటి గురించి మాట్లాడాలన్నారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలిచ్చారని, వాటిలో కొన్నింటిని అమలు చేస్తున్నట్టు చెప్పి మూడు నెలలకే ఎత్తేశారని అన్నారు. పది మంది కాంగ్రెస్ లీడర్లు కలిసి తిరిగే పరిస్థితే లేదని, అలాంటి పార్టీని ఎలా నమ్ముతారన్నారు.
సీఎం కేసీఆర్ఏడాదిలోనే 4 లక్షల మంది ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలు ఇచ్చారన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ డిక్లరేషన్ చెత్తకుండీలో వేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదన్నారు.