జై కృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కూతురు రాషా తడానీ జంటగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి రూపొందించిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించారు. జులై 30న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. శ్రీను (జైకృష్ణ)కు మంగ (రాషా తడానీ) అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగ, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు ప్రేమలో పడుతుంది.
అదే సమయంలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అడ్డంకిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? లేదా? అనేదే కథగా ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. జై కృష్ణ డైలాగ్ డెలివరీతోపాటు యాక్షన్ సీన్స్లోనూ మంచి ఇంటెన్సిటీని చూపించాడు. రాషా తడానీ స్ర్కీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. లవ్, యాక్షన్, ఎమోషన్తో కూడిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ఈవెంట్లో ఎంపీ కేశినేని చిన్ని, కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు పాల్గొని సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. జై కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. ఇందులోని ఎమోషన్స్, పాత్రలు అందరికీ కనెక్ట్ అవుతాయి’ అని చెప్పాడు. తెలుగు సినిమాలో నటించడం ఆనందంగా ఉందని రాషా తడానీ చెప్పింది. యూత్తోపాటు ఫ్యామిలీస్కు నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు అజయ్ భూపతి అన్నాడు.
