- కేంద్రంతో మాట్లాడి కాళేశ్వరం పంపులు ఆన్ చేయించాలి: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ పనిచేస్తుందని, కేంద్ర జలశక్తి మంత్రితో మాట్లాడి కాళేశ్వరం పంపులను ఆన్ చేయించాలని రాంచందర్ రావుకు సూచించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు కాళేశ్వరంపై వాస్తవాలు తెలుసని, మరి ఆయన ఎన్డీఎస్ఏ చైర్మన్తో మాట్లాడి నీళ్లు ఇప్పించవచ్చు కదా అని అన్నారు.
అనవసరంగా రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. షాబాద్ ఘటనను సైతం బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డికి అంటగట్టడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు తాము రాజకీయం చేయలేదని, కాని ఇప్పుడు షాబాద్ ఘటనపై కేటీఆర్, హరీశ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
