నిన్న మెున్నటి వరకూ మెల్లగా కుదుటపడుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా మళ్లీ ఇరాన్ దేశంపై తీవ్రదాడులు చేయటమే. మరోపక్క హార్మూజ్ జలసంధిపై పెత్తనం తమదేనని.. అన్ని దేశాల షిప్స్ తమకే టోల్ కట్టాలంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ వాణిజ్య రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఈ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదేలుచేస్తున్నాయి.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఉదయం 10.05 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 471 పాయింట్ల నష్టంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 644 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 347 పాయింట్ల పతనంతో ముందుకు సాగుతున్నాయి. అయితే మార్కెట్లను ప్రభావితం చేసిన కారణాంలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
అమెరికా దాడులు కొనసాగింపు..
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అమెరికా సైన్యం వరుసగా మూడో రాత్రి కూడా ఇరాన్పై దాడులు నిర్వహించింది. దీనికి తోడు అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు సంబంధించిన నౌకాయానంపై దిగ్బంధాన్ని పునరుద్ధరించడంతో పాటు, హోర్ముజ్ జలసంధి భద్రత కోసం 20 శాతం టోల్ టాక్స్ విధించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గు..
అమెరికా ఇరాన్ మధ్య ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 85 డాలర్లను దాటింది. జూన్ 17న అమెరికా-ఇరాన్ యుద్ధ విరమణకు అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత ఇదే అత్యధిక స్థాయి. హోర్ముజ్ జలసంధిలో ఇరు దేశాల చర్యలు తీవ్రతరం కావడంతో ప్రపంచ ఇంధన సరఫరాపై అనిశ్చితి పెరిగింది.
ఇండియా విక్స్ పెరుగుదల..
భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం భారత స్టాక్ మార్కెట్పైనా కనిపించింది. మార్కెట్ భయాందోళనలను సూచించే ఇండియా విక్స్ సూచీ సుమారు 3 శాతం పెరిగి 14 స్థాయికి చేరుకుంది. ఇది పెట్టుబడిదారుల్లో అనిశ్చితి, ఆందోళన పెరిగినట్లు సంకేతాలు ఇస్తోంది.
