విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని : మంత్రి సీతక్క

విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని : మంత్రి సీతక్క

 

  • గిరిజనులను చెట్లకు కట్టేసి కొట్టించిన చరిత్ర బీఆర్ఎస్ ది
  • రాహుల్​గాంధీది స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబం
  • పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: దేశంలో పేదలకు భూములు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వని బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులను చెట్టుకు కట్టేసి కొట్టించిన చరిత్ర బీఆర్ఎస్ దని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిందని పేర్కొన్నారు.

గురువారం రాహుల్ గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని ములుగులోని గట్టమ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంచర్ల వరకు 2 వేల మంది యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఓ గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మూడుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదిలేసి, పేదల కోసం పోరాడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు.

త్యాగాలు చేసిన నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీలపై బీజేపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఏకకాలంలో 5 లక్షల ఇండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం పేరిట చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించిన నీచ సంస్కృతి బీఆర్​ఎస్​పార్టీదన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​విజయానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, యూత్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్​ రెడ్డి, స్పోర్ట్స్​అథారిటీ చైర్మన్​ శివసేనా రెడ్డి, కాంగ్రెస్​ రాష్ట్ర మీడియా ఇన్​చార్జి సామ రామ్మోహన్​ రెడ్డి, యూత్​ కాంగ్రెస్​ రాష్ట్ర కార్యదర్శి సూర్య, రాష్ట్ర ఇన్​చార్జి ఖలీద్​, జిల్లా అధ్యక్షుడు ఇస్సార్​ఖాన్​,  టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.