
ములుగు, వెలుగు: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా శాశ్వత పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మంగళవారం ములుగు కలెక్టరేట్ లో మేడారం మహా జాతరపై కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్వో రాహూల్ కిషన్ జాదవ్ తో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జాతర కోసం ప్రభుత్వం రూ.135 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటికే రూ.33 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. శ్వాశత పనులను నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించాలని, క్యూ లైన్లు, వాటిపై షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.