వర్షాలకు నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు : మంత్రి సీతక్క

వర్షాలకు నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: రానున్న రోజుల్లో  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో వర్షాలకు జాగ్రత్తలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లోని కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, నీరు ప్రవహించే కాల్వల్లో గుర్రపు డెక్క, మొక్కలను తొలగించాలని  తెలిపారు.

వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు తాగునీరు, ఆహారం పంపిణీపై దృష్టి సారించాలని తెలిపారు. 3 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పశువుల రక్షణపై దృష్టి సారించడంతో పాటు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. భారీ వర్షాలు, మేడారం మహా జాతర  జిల్లా యంత్రాంగం సవాల్ గా స్వీకరించి అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క కోరారు. సమీక్ష డీఎస్పీ రవీందర్, ఆర్డీవో వెంకటేశ్, జిల్లా, మండల అధికారులు, మేడారం పూజారులు తదితరులు పాల్గొన్నారు.