
- పీఎం జన్మన్ స్కీమ్ వర్క్ షాప్లో మంత్రి సీతక్క ఆవేదన
- మౌలిక సౌకర్యాల కల్పనకు అధికారులు ఇబ్బంది పెడుతున్నరని వెల్లడి
- 5 రాష్ట్రాల అధికారులతో కేంద్ర ట్రైబల్ ఆఫీసర్ల రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ట్రైబల్ ఏరియాల్లో అభివృద్ధికి ఫారెస్ట్ చట్టాలు అడ్డుపడుతున్నాయని, అనుమతుల పేరుతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పంచాయతీ రాజ్ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. అభివృద్ధి వర్సెస్ ఫారెస్ట్ చట్టాలు అన్నట్లుగా పరిస్థితి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ అధికారులతో మీటింగ్లు నిర్వహిస్తున్నా అభివృద్ధి ముందుకు సాగడం లేదన్నారు.
శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో పీఎం జన్మన్, డీఏజేజీయూఏ (ధర్తి ఆబ జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్) పై వివిధ రాష్ట్రాల వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్కు మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు, కేంద్ర ట్రైబల్ శాఖ సెక్రటరీ మనీష్ ఠాకూర్ తో పాటు చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఘండ్, తెలంగాణ నుంచి వివిధ శాఖల అధికారులు, ఐటీడీఏ పీవోలు హాజరయ్యారు.
ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాల్లోని ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దికి అటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ‘‘ములుగులో 77 శాతం ఫారెస్ట్ ఉంది. అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో కనీంస రోడ్లు కూడా వేయలేకపోతున్నాం. గుడిసెల్లో ఉన్న పాఠశాలకు పక్కా భవనాలు నిర్మిద్దామనుకున్నా, హాస్పిటల్స్ నిర్మించాలన్నా అటవీ అనుమతులు రావడం లేదు.
ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నా ఇప్పటికీ అటవీ గ్రామాలకు కరెంటు లేదు. మంచినీటి బోర్లు కూడా వేయనీయడం లేదు” అని సీతక్క పేర్కొన్నారు. అడవి బిడ్డల అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని మంత్రి కోరారు. సీఎస్ రామకృష్ణారావు రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ఇందిరా సౌర జలవికాసం పేరుతో ట్రైబల్స్ కు సోలార్ పంప్ సెట్ తో పాటు పండ్ల మొక్కలు నాటే స్కీమ్ ను ప్రారంభించిందన్నారు.
వచ్చే ఐదేళ్లలో ఈ స్కీమ్ కు రూ.12,600 కోట్లు ఖర్చు చేస్తుందని, 2 లక్షల మందికి పైగా ట్రైబల్స్ కు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలుగుతుందని సీఎస్ తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రాల్లో పథకాల అమలు తీరును సమీక్షించడంతో పాటు ఆయా పథకాలను ఇంకా సమర్థవంతంగా ఎలా అమలు చేయాలో సూచించారు.
త్వరలో స్త్రీనిధిలో ఖాళీల భర్తీ
సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఆర్థిక సాధికారత కోసం ఎన్నో లక్ష్యాలను నిర్దేశించారని, వాటిని చేరుకునేందుకు స్త్రీనిధిని బలోపేతం చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఇందులో భాగంగా స్త్రీనిధి సంస్థలో ఉన్న 163 ఖాళీలను భర్తీ చేస్తామని, నియామకాల ఫైల్ను త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. స్త్రీనిధి కోసం హిమాయత్నగర్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని స్త్రీనిధి కార్యాలయంలో స్త్రీనిధి క్రెడిట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 46 వ మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా స్ర్తీనిధి మేనేజ్మెంట్ బోర్డు పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. స్త్రీనిధి సంస్థ మహిళా ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తోందన్నారు. త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మహిళా సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చుకుంటామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడంతో తిరిగి మన రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు అడుగుపెట్టాయని, 26% వడ్డీలు వసూలు చేస్తూ మహిళా సంఘాలను వేధిస్తున్నాయని చెప్పారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల వైపు మహిళలు వెళ్లకుండా సెర్ప్, మెప్మా, స్త్రీనిధి కృషి చేయాలన్నారు. మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించొద్దని, వేధింపులు, వడ్డీల భారాలు లేకుండా ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు వినియోగించుకోవాలని, మహిళా బ్యాంకుగా స్త్రీ నిధి తన ఘనతను చాటుతోందని పేర్కొన్నారు. కమర్షియల్ బ్యాంకులకు మించి స్త్రీ నిధి బ్యాంకు సేవలందించాలన్నారు. స్త్రీనిధి ద్వారా ఒక్కో మండలంలో మహిళా సంఘాల ద్వారా ఒక్కో పరిశ్రమను చేపట్టాలన్నారు.