- సీబీవో ఆడిటర్లకు ల్యాప్టాప్లు పంపిణీ
హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాలకు లావాదేవీల్లో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీ తక్క సూచించారు. బ్యాంక్రుణాలను సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో బుధవారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి సీబీవో(కమ్యూనిటీ బేస్డ్ఆర్గనైజేషన్స్) ఆడిటర్లకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ.. గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా ఎస్ హెచ్ జీలు, వీవోలు, మండల సమాఖ్యల్లో ఆర్థిక పారదర్శకతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ల్యాప్టాప్ల వినియోగంతో డిజిటల్ ఆడిట్ ప్రక్రియ వేగవంతమవుతుందని, రియల్ టైమ్ డేటా నమోదు, నివేదికల తయారీ సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కారం
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెకు అవార్డు అందజేశారు. ప్రజాసేవ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం మంత్రి చేసిన సేవలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

