స్కిల్స్ పెంచుకుంటేనే భవిష్యత్తు .. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

స్కిల్స్ పెంచుకుంటేనే భవిష్యత్తు .. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: యువత ఉన్నత చదువుతో పాటు స్కిల్స్​ పెంపొందించుకునేందుకు ముందుకు రావాలని మంత్రి సీతక్క పిలపునిచ్చారు. గురువారం ములుగులోని టాస్క్  సెంటర్​లో టెక్నికల్, నాన్ టెక్నికల్  కోర్సుల్లో శిక్షణ పొంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 51మందికి నియామక పత్రాలను అందజేశారు. బండారుపల్లి పీఎం శ్రీ మోడల్​ స్కూల్​లో 10 కంప్యూటర్లతో ల్యాబ్ ను ప్రారంభించారు. రూ.19 కోట్లతో ములుగు నుంచి పొట్లాపూర్​ వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. జగ్గన్నపేట ట్రైబల్​ కాలేజీలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్, ధ్రువపత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..శిక్షణ పొంది నైపుణ్యత పెంచుకుంటే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలను కాపాడుకుంటూ, మరిన్ని కంపెనీలు వచ్చేలా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. టాస్క్  సెంటర్ లో శిక్షణ పొందిన వారిలో 51 మంది ఉద్యోగాలు పొందారని, 40 కంపెనీల ప్రతినిధులు ములుగు జిల్లాలో పర్యటించారని చెప్పారు. 10 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. 

రానున్న రోజులలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్  అథారిటీ చైర్మన్  శివసేనారెడ్డి, ములుగు కలెక్టర్  దివాకర్ టీఎస్, లైబ్రరీ చైర్మన్  రవిచందర్, టాస్క్  సీఈవో శ్రీకాంత్  సిన్హా, టాస్క్ ప్లేస్‌‌మెంట్  డైరెక్టర్  ప్రదీప్ రెడ్డి, రీజినల్  సెంటర్స్  హెడ్  స్నేహారెడ్డి, శ్రీయా ఇన్ఫోటెక్​ సీఈవో వినోద్  పాల్గొన్నారు.