రిజర్వేషన్లను ఎత్తివేయడమే బీజేపీ లక్ష్యం: శ్రీధర్​బాబు

రిజర్వేషన్లను ఎత్తివేయడమే బీజేపీ లక్ష్యం: శ్రీధర్​బాబు
  • రామగుండం నుంచి మణుగూరు వరకుఇండస్ట్రియల్​​ కారిడార్​ ఏర్పాటు చేస్తాం  
  •  గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి 
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

గోదావరిఖని, వెలుగు:  డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్​దేశ ప్రజలందరికి సమాన న్యాయం జరగాలని రాసిన భారత రాజ్యాంగాన్ని తిరగరాయాలని బీజేపీ చూస్తున్నదని, ఇది దేశానికి ప్రమాదకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు అన్నారు. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం గోదావరిఖనిలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్​సింగ్​ రాజ్​ఠాకూర్, ఐఎన్​టీయూసీ 
సెక్రెటరీ జనరల్​ బి.జనక్​ ప్రసాద్​తో కలిసి మంత్రి మాట్లాడారు. 

రాజ్యాంగాన్ని మార్చడమంటే దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బడుగు, బలహీన వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లను ఎత్తివేయడమే అవుతుందని, ఇదే బీజేపీ లక్ష్యమన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత 1959లో ఆర్ఎస్ఎస్​ వాళ్లు దాన్ని కాలబెట్టారని, దాదాపు 35 సంవత్సరాల వరకు ఆర్ఎస్ఎస్​ ఆఫీస్​లో భారత జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. దీన్ని బట్టి రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీలకు ఏరకమైన గౌరవం ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్​ పార్టీ యువన్యాయం పేరుతో ఉన్నత చదువులు చదివిన మెరిట్​స్టూడెంట్లకు ఉద్యోగం వచ్చే వరకు ఏటా రూ.లక్ష ఇచ్చే స్కీమ్​ను మేనిఫెస్టోలో పొందుపర్చామన్నారు.

75 ఏండ్ల కాంగ్రెస్​ పాలనలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే..పదేండ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాల నుంచి తొలగించారని, దీనికి బీజేపీ లీడర్లు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. రామగుండం నుంచి మణుగూరు వరకు తప్పకుండా ఇండస్ట్రియల్ ​కారిడార్​ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. 

సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్​సీఎల్ ​వంటి సంస్థలతో మాట్లాడుతున్నామని, ఆయా పరిశ్రమలకు అవసరమైన సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోకుండా స్థానికంగానే లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ ​నుంచి బెంగళూర్ ​వరకు కూడా ఐటీ, హార్డ్​వేర్​ కారిడార్​ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్​లను దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు.