రాహుల్​ను ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నరు : మంత్రి శ్రీధర్​బాబు

రాహుల్​ను ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నరు : మంత్రి శ్రీధర్​బాబు
  • కేంద్రంలో కాంగ్రెస్​ రావడం ఖాయం: మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో  కేంద్రంలో  కాంగ్రెస్​ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  శనివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్​జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్​గాంధీ పోరాటం చేస్తున్నారని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు.

భారత్​జోడో యాత్రపేరుతో కన్యా కుమారి నుంచి కాశ్మీర్​వరకూ పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. న్యాయ్​యాత్ర పేరుతో  దేశవ్యాప్తంగా 10 వేల కి.మీ. పాదయాత్ర చేసి యువత, మహిళలు, రైతులు, కార్మికుల సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. అందుకే రాహుల్​గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.

పాంచ్ న్యాయ్​అమలు చేస్తం

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్​గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో  బీసీ కుల గణనను ప్రభుత్వం మొదలు పెట్టిందని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు.  ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో  ఐదు గ్యారంటీలను కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్నదని.. ఆరో గ్యారంటీగా ఇందిరమ్మ ఇండ్లను కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పార్లమెంట్​ఎన్నికల సందర్భంగా  రాహుల్​కాంగ్రెస్​ తరఫున పాంచ్ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. "2024 ఎన్నికలు~ మార్పు కోసం"  అనే నినాదంతో ముందుకు పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేసినట్టుగానే కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే పాంచ్​న్యాయ్ గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.