- టీఆర్ఎస్కు ఓటెయ్యని దుర్మార్గుడెవడూ బాగుపడడు
- మంత్రి శ్రీనివాస్గౌడ్ శాపనార్థాలు
జడ్చర్ల, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది, తమ పార్టీకి ఓటెయ్యని దుర్మార్గులను భగవంతుడు కూడా క్షమించడని, వాళ్లు, వాళ్ల ఇండ్లు నాశనమైపోతాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లిలోని చంద్రాగార్డెన్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ కల్యాణలక్ష్మి.. రైతు బీమా.. వాళ్ల తల్లికి పెన్షన్.. అన్నీ తిని.. ఎవడైనా దుర్మార్గుడు టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే భగవంతుడు కూడా క్షమించడు.. వాడు బాగుపడడు.. వాని ఇల్లు బాగుపడదు.. నాశనమైపోతడు’’ అని ఫైర్ అయ్యారు. ‘‘కర్నాటకలో కరెంట్ ఇయ్యక, పెన్షన్ ఇయ్యక, రైతుబంధు, బీమా ఇయ్యక.. సస్తే, బతికితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యక ఆ రాష్ట్రాన్ని నాశనం చేసి వచ్చిన వాళ్లకు ఇక్కడ ఎట్ల సపోర్ట్ చేస్తం’’ అని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. దీన్ని గుర్తించకుండా ఇతర పార్టీలకు ఓటేస్తే శాపం తగులుతుందని, దీన్ని భగవంతుడు కూడా క్షమించడని అన్నారు.