- మహిళా దర్బార్ లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన మహబూబ్ నగర్ బాధితులు
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు మహబూబ్ నగర్ బాధితులు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నిర్వహించిన మహిళా దర్బార్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన భర్త విశ్వనాథ్ భాండేకర్ ను కిడ్నాప్ చేసి అక్రమ కేసులు పెట్టారని ఆయన భార్య పుష్పలత గవర్నర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వనాథ్ భార్యతోపాటు రాఘవేంద్ర రాజు, నాగరాజు కుటుంబ సభ్యులు మహిళా దర్బార్ లో గవర్నర్ ని కలిశారు.
మహబూబ్నగర్లో గత ఫిబ్రవరి నెల 23, 24 తేదీల్లో కిడ్నాప్కు గురయ్యారనే ప్రచారం జరిగిన ముగ్గురిని మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చూపారు. మహబూబ్నగర్కే చెందిన గులాం హైదర్ అనే వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించారని చలువగాలి నాగరాజు, బండేకర్ విశ్వనాథ్రావు, వర్ధ యాదయ్యల పై ఐపీసీ 120బి, 307, 115, ఆర్మ్స్ యాక్ట్ 25 కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే వారిని అరెస్టు చేసిన టైంలో కుటుంబ సభ్యులకు గానీ, స్థానిక పోలీసులకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలు రేకెత్తించింది.