
- ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- భద్రకాళి ఆలయం చుట్టూ కబ్జాలను తొలగిస్తాం
- దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు : దేవాదాయ శాఖకు చెందిన భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. వరంగల్లోని భద్రకాళి ఆలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చిచేస్తామని స్పష్టం చేశారు. భద్రకాళి ఆలయం వద్ద వేద పాఠశాల నిర్మాణానికి బుధవారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూరా నిర్మించబోయే రాజగోపురాల చిత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, భద్రకాళి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వేద పాఠశాల నిర్మాణం పూర్తయితే ఆలయానికి మరింత పేరు వస్తుందన్నారు. భద్రకాళి ఆలయ మాడవీధులకు ‘కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ నుంచి రూ.10 కోట్లు, రాజగోపురాల నిర్మాణానికి రూ.20 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు ఇచ్చామన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఆలయాన్ని మరింత విస్తరించాల్సి ఉందన్నారు.
ఈ పనులకు స్థలం కొరత ఉన్నందున ఆలయం చుట్టూరా ఉన్న ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలని కూల్చివేస్తామని చెప్పారు. కాగా భద్రకాళి గుడికి 11 ఏండ్లుగా ఆలయ కమిటీ లేదన్న విషయాన్ని కొందరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆమె త్వరలోనే కమిటీ నియమిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, ఆలయ ప్రధానార్చకుడు శేషు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.సునీత, ఆలయ ఏవో కె.శేషుభారతి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి పాల్గొన్నారు.