హైదరాబాద్ నగరంలో వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని , పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలిసి ఆయన పరిశీలించారు. రానున్న వారం పాటు వర్షాలు ఉన్నాయని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజలకు ఎలాంటి సమస్యలున్న జీహెచ్ఎంసీ కి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి తలసాని సూచించారు. వెంటనే సమస్యలను పరిష్కారిస్తామని చెప్పారు. నాలాల దగ్గర ఆక్రమ నిర్మాణాలతో కొన్ని ఇబ్బందులు అయ్యాయన్న మంత్రి.. ఆక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మరొవైపు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 513.62 మీటర్లకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు సాగర్ తూము గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.