- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను చూసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగిపోయిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో మంత్రి అధ్యక్షతన సనత్నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన తలసాని మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఎకరాకు సాగునీరు, 24 గంటల విద్యుత్ సరఫరాను తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదన్నారు.
చెప్పింది చేసే సత్తా ఒక్క కేసీఆర్కే ఉందన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గడిచిన నాలుగున్నరేండ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్.. అత్యధిక కాలం దేశాన్ని, ఉమ్మడి ఏపీని పాలించి ప్రజలకు ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.