కూసుకుంట్లని గెలిపిస్తే మునుగోడులో అభివృద్ధి జరుగుతుంది : మంత్రి తలసాని

కూసుకుంట్లని గెలిపిస్తే మునుగోడులో అభివృద్ధి జరుగుతుంది : మంత్రి తలసాని

మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారో బీజేపీ నాయకులు చెప్పడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడెంలో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వెనుక ఎవరు ఉన్నారని..? తలసాని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. 

అన్ని గ్రామాల్లోనూ తమ పార్టీకి కార్యకర్తలు బలంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఉప్పరిగూడెం గ్రామానికి రాక దాదాపు మూడున్నర సంవత్సరాలు అవుతోందన్నారు. బీజేపీ నాయకులు ప్రచారం కోసం తిరుగుతుంటే ప్రజలు వారిని అడ్డుకుంటున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు చాలా  సీరియస్ గా తీసుకున్నాయి. ప్రస్తుతం బరిలో 47 మంది ఉన్నారు.  నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, 6న ఫలితాలు వెలువడనున్నాయి.