సినీ కార్మికుల కోసం దాసరి తన జీవితాన్నే త్యాగం చేశారు : తలసాని

సినీ కార్మికుల కోసం దాసరి తన జీవితాన్నే త్యాగం చేశారు : తలసాని

దాసరి నారాయణరావు నిరంతరం కార్మికుల కోసం కృషి చేశారని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దాసరి మరణించిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందన్నారు. దాసరితో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు. చిత్రపురి కాలనీ కోసం దాసరి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చిత్రపురి కాలనీ వాసులకు కూడా అందజేసేట్లు కృషి చేస్తామన్నారు. దాసరి వంటి గొప్ప వ్యక్తి మళ్లీ పుట్టరని వ్యాఖ్యానించారు. సినీ కార్మికుల గురించి తన జీవితాన్నే త్యాగం చేశారని చెప్పారు. దాసరి బతికి ఉన్నప్పుడు ఆయన ఇల్లు  ధర్మసత్రం తరహాలో ఉండేదన్నారు. దాసరిని కోల్పోయిన తర్వాత కార్మికులకు ఆయన లేని లోటు తెలిసి వస్తుందని చెప్పారు. 

హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో తెలుగు సినీ వర్కర్స్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని హాజరై.. దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరోవైపు.. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్, అది శేషగిరి రావు కామెంట్స్ పైనా మంత్రి తలసాని స్పందించారు. నంది అవార్డులు ఇవ్వమని సినీ పరిశ్రమ తరపున ఎవరు ప్రభుత్వానికి సందేశం పంపలేదన్నారు. ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని, కొందరు మీడియా కనిపిస్తే ఉత్సాహంగా మాట్లాడతారని చెప్పారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డులు అందిస్తామన్నారు.