
హైదరాబాద్, వెలుగు: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)ల్లో పనిచేసే ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. శనివారం రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్ మార్నేని రవీందర్ రావు నేతృత్వంలో రాష్ట్రంలోని తొమ్మిది డీసీసీబీ చైర్మన్లు మంత్రి తుమ్మలను కలిశారు. వేతన సవరణ కోసం వినతి పత్రం సమర్పించారు.
రైతులకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి తుమ్మలకు డీసీసీబీ చైర్మన్లు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా..2022 నవంబర్ 1 నుంచి పెండింగ్లో ఉన్న డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణ విషయంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల.. "మేం రైతు రుణమాఫీ చేశాం. డీసీసీబీ ఉద్యోగులకు కూడా అన్ని విధాలా సహాయం అందిస్తాం. వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు.