- సర్కార్ వడ్లు దారిమళ్లిస్తే సహించేది లేదు: ఉత్తమ్
- పదేళ్ల సీఎంఆర్ వ్యవహారాలపై సమగ్ర ఆడిట్కు ఆదేశాలు
- డిఫాల్టర్ మిల్లర్లపై రెవెన్యూ, సివిల్, క్రిమినల్ చర్యలు
- ఆస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల అమలుకు ఆదేశం
- ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందేనని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి గింజ బియ్యం, ప్రతి రూపాయి బకాయిని రికవరీ చేయడమే లక్ష్యమని చెప్పారు. సీఎంఆర్ డిఫాల్టర్లను ముందుగానే గుర్తించేందుకు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో జరిగిన ఉన్నతస్థాయి రివ్యూ మీటింగ్లో సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ డీఎస్ చౌహాన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లకు పైగా జరిగిన సీఎంఆర్ కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ నిర్వహిం చాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్లకు అప్పగించిన నిల్వలు, ప్రభుత్వానికి అందాల్సిన, వాస్తవంగా అందిన సీఎంఆర్, డిఫాల్టులు, బకాయిలు, రికవరీలు, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలను జిల్లా, మిల్లు, సంవత్సరం వారీగా సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ సీఎంఆర్ పరిమాణం, దాని విలువ, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సర్కార్ వడ్లను దారి మళ్లిస్తే చర్యలు
ప్రభుత్వ ధాన్యం లేదా బియ్యం నిల్వలను దారి మళ్లించడం, సీఎంఆర్ బకాయిలు చెల్లించకుండా ప్రజాధనానికి నష్టం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని పలువురు మిల్లర్లు బకాయిలు చెల్లించగా, మిగిలిన ప్రతి కేసుకు మిల్లు వారీగా నిర్దిష్ట కాలపట్టికతో రికవరీ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మిల్లర్లకు అప్పగించే ప్రతి ధాన్యం బస్తా ప్రభుత్వ ఆస్తి అని, తిరిగి రాని ప్రతి బియ్యం గింజ ప్రజాపంపిణీ వ్యవస్థను బలహీనపరుస్తుందన్నారు. డిఫాల్టర్ మిల్లర్ల చర, స్థిరాస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల అమలు, సెక్యూరిటీల స్వాధీనం ద్వారా ప్రభుత్వ బకాయిల వసూళ్లను స్పీడప్ చేయాలన్నారు.
అవసరమైన చోట రెవెన్యూ రికవరీతో పాటు సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని, ప్రభుత్వ ధాన్యం నిల్వలను క్రమం తప్పకుండా ధ్రువీకరించాలన్నారు. క్యూఆర్ కోడ్ గన్నీ బ్యాగులు, జీపీఎస్ సాయంతో వాహనాల ట్రాకింగ్, జియో ట్యాగింగ్, ఆన్లైన్ స్టాక్ వెరిఫికేషన్, రియల్టైమ్ స్టాక్ రీకన్సిలియేషన్, రిస్క్ ఆధారిత ఆడిట్లు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వంటి సంస్కరణలను అమలు చేయనున్నట్లు చెప్పారు.
నిజాయితీగా వ్యవహరించే రైస్ మిల్లర్లకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రభుత్వ ధాన్యం మళ్లింపు లేదా ఒప్పందాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర తనిఖీలు, దాడులు, నమోదైన క్రిమినల్ కేసులు, రికవరీలు, విచారణలపై వివరాలు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ఫిజికల్గా తనిఖీలు చేయడం, ప్రభుత్వ నిల్వలను గుర్తించడం, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించడం, ప్రభుత్వ ధాన్యం, బియ్యం మళ్లింపుపై దర్యాప్తు కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.
