మక్తల్, వెలుగు: మక్తల్ నియోజకవర్గంలో ఇప్పటికే 36 వేల ఓట్లు తొలగించారని, తాజాగా మరో 76 వేల ఓట్ల తొలగింపునకు నోటీసులు వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడటం పార్టీ కార్యకర్తల బాధ్యతని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని ద్వారక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఎల్ఏలు, సూపర్వైజర్లు, పార్టీ శ్రేణుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సర్ప్రక్రియలో సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అర్హులైన పేదల ఓట్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. కష్టకాలంలో పార్టీని కాపాడింది కార్యకర్తలేనని, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి ఫలాలు చేకూర్చాలంటే ప్రజా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ సమావేశం అనంతరం పట్టణంలో ఈ నెల 10న నిర్వహించనున్న చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, ఆమె ఆశయాలను స్మరించుకుంటూ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మక్తల్ నియోజకవర్గ అబ్జర్వర్ గుత్తా అమిత్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ రేవతి గౌడ్, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
