మహిళల పేరు మీదే స్కీములు మంజూరు : మంత్రి వాకిటి శ్రీహరి

మహిళల పేరు మీదే స్కీములు మంజూరు : మంత్రి వాకిటి శ్రీహరి
  • ఒక మహిళ శిక్షణ పొందితే కుటుంబమంతా శిక్షణ పొందినట్లే
  • త్రీడీ స్టడీ మెటీరియల్​తో వంద శాతం ఫలితాలు సాధించాం

పాలమూరు, వెలుగు: మహిళలకే ఏ బాధ్యత ఇచ్చినా సురక్షితంగా ఉంటుందని, అందుకే ప్రజా ప్రభుత్వంలో ఏ పథకమైనా వారి పేరు మీదే మంజూరు చేస్తున్నామని పశు సంవర్థక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సారి ఆయన పాలమూరు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్​ పార్టీ లీడర్లు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి చేరుకోగానే ముందుగా ఆయన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డిలతో కలిసి పండుగ సాయన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్​ పార్టీ జిల్లా ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రికి భారీ గజమాలతో సత్కరించారు. దారి పొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పార్టీ ఆఫీసులో విలేకర్లతో మంత్రి మాట్లాడారు. 1991లో ఇంటర్ చదువుకునే రోజుల్లో తాను సైకిల్ పై పాలమూరులో తిరిగానని, ఇప్పుడు మంత్రిగా ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో తనను మంత్రిగా చేయాలని కోరినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.  

సీఎం రేవంత్ రెడ్డి ఏ లక్ష్యంతో మంత్రిగా నియమించారో, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలమూరు అభివృద్ధికి పాటుపడతానన్నారు. పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని  పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కాంగ్రెస్​ను వీడలేదని.. దేశంలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేయడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారన్నారు.  తన లాంటి సామాన్యుడిని సైతం మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ సొంతమన్నారు. పాలమూరుకు ట్రిపుల్  ఐటీని  మంజూరు చేసి సీఎం జిల్లాపై  తనకున్న ప్రేమను చాటారన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొనానని, ఉమ్మడి జిల్లాలో ఆయా శాఖలకు సంబంధించి పూర్తిస్థాయి డేటాతో రావాలని సీఎం తనతో చెప్పారన్నారు. 

పాలమూరు మహిళలకు పట్టుదల ఎక్కువ

పాలమూరు మహిళలకు పట్టుదల ఎక్కవని, వారు దేనికి తీసిపోరని మంత్రి అన్నారు. జిల్లా పార్టీ ఆఫీసులో ప్రెస్​మీట్​ అనంతరం ఆయన స్థానిక ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 'మహబూబ్​నగర్ ఫస్ట్' శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  కుటుంబంలో ఒక్క మహిళ శిక్షణ పొందితే ఆ కుటుంబం మొత్తం శిక్షణ పొందినట్లేనని అన్నారు. 

పాలమూరులో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ద్వారా విద్యార్థ/లు మంచి ఫలితాలు సాధించారని, తాను కూడా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని మక్తల్ నియోజకవర్గంలో ఉన్న  3,718 మంది టెన్త్​ స్టూడెంట్లకు పంపిణీ చేశానన్నారు. దీని ద్వారా 62 శాతం ఉన్న  పాస్ పర్సంటేజీని వంద శాతానికి సాధించామని, ఇది యెన్నం సూచనతోనే సాధ్యమైందన్నారు.

అక్కా చెల్లెళ్ల దీవెనలు సంతోషాన్నిస్తున్నాయి..

పల్లెల పొంటి పోతుంటూ అక్కాచెల్లెళ్లు ఇస్తున్న దీవెనుల సంతోషాన్ని ఇస్తున్నాయని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. సీఎంగా రేవంత్​ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మహిళల పేర్ల మీదే అన్ని స్కీములను మంజూరు చేస్తున్నారన్నారు. కుటుంబాలను కాపాడే అజ్ఞాత వీరులు మహిళలే అన్నారు. మహబూబ్​నగర్ అన్ని రంగాల్లో నంబర్​ వన్​గా ఉండాలన్న లక్ష్యంతో , ఆలోచనతో వచ్చినదే 'మహబూబ్​నగర్ ఫస్ట్' అని అన్నారు. 

మహిళలు ఎంత ఎత్తు ఎదగాలన్న అండగా మహబూబ్​నగర్​ ఫస్ట్​ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్​ విజయేందిర బోయి, మైనార్టి ఫైనాస్​ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్​, ముడా చైర్మన్​ లక్ష్మణ్​ యాదవ్​, జిల్లా ఒలంపిక్​ సంఘం అధ్యక్షుడు ఎన్​పీ వెంకటేశ్​, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్​ ముదిరాజ్​, మాజీ మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు