- రూ. 18 కోట్లతో అన్ని ఏర్పాట్లు పూర్తి: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: మరో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్కు హైదరాబాద్ రెడీ అయింది. ఈ నెల 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి హాకీ స్టేడియంలో విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ గచ్చిబౌలిలోని హాకీ గ్రౌండ్లో జరగనుంది. ఇండియా సహా 8 జట్లు పోటీ పడుతున్న ఈ మెగా టోర్నీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవితో కలిసి గురువారం టోర్నీ వివరాలను వెల్లడించారు. వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని దేశాల జట్లు సిటీ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయని తెలిపారు. ఈ టోర్నీ కోసం ప్రభుత్వం, క్రీడా శాఖ రూ. 18 కోట్లు ఖర్చు చేస్తోందని ఇందులో రూ. 9 కోట్లు వెచ్చించి రెండు ఆస్ట్రో టర్ఫ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్), హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ టోర్నీని సక్సెస్ఫుల్గా నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. టోర్నీ ఓపెనింగ్కు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు.
