భారత దేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి పీవీ: మంత్రి వివేక్

భారత దేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి పీవీ: మంత్రి వివేక్

హైదరాబాద్: భారతదేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు అని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. హైదరాబాద్ నెక్లస్ రోడ్‎లోని పీవీ ఘాట్‎లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ కుటుంబ సభ్యులు, మంత్రి వివేక్, మంత్రి కొండా సురేఖ, తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రపంచ అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి ఫౌండేషన్ వేసింది పీవీ నర్సింహా రావేనని కొనియాడారు.

ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి.. దేశంలో పేదరికాన్ని తగ్గించారన్నారు. సింగరేణి సంస్థను కాపాడటానికి పీవీ రూ.400 కోట్లు కేటాయించారని.. మా నాన్న కాకా, పీవీ కలిసి పని చేశారని గుర్తు చేసుకున్నారు. పేద ప్రజల కోసం మా నాన్న అడగ్గాన్నే రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. పీవీ ఎప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసమే కృషి చేశారని కొనియాడారు. 

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..  భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు తెరిచి పుస్తకమన్నారు. భారత దేశానికి ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకురావడానికి పీవీ గణనీయంగా కృషి చేశారని అన్నారు. పీవీ దృష్టి అంత పరిపాలన, పేద ప్రజల సంక్షేమం కోసమే ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఆయన చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పీవీ కృషి చేశారన్నారు. పీవీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ పాలన చేస్తున్నాడని  చెప్పారు.