హైదరాబాద్: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. ముస్లిం నేతకు కేబినెట్లో చోటు కల్పిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం (అక్టోబర్ 25) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట్ డివిజన్లో పర్యటించిన మంత్రి వివేక్ ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని.. ఆ పార్టీల తప్పుడు హామీలు నమ్మి మోసపోవద్దని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అక్టోబర్ 25న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు.
షేక్ పేట డివిజన్లోని వినోభా నగర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. నవీన్ యాదవ్తో కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు వివేక్. నవీన్ యాదవ్ గెలిస్తేనే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను అందిస్తుందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్కు వస్తే రోడ్లు ఎందుకు వేయలేదో బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని సూచించారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనన్న మంత్రి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బీజేపీ సపోర్టు చేస్తుందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఢిల్లీలో దోస్తానా ఉందన్నారు. అందుకే గత పార్లమెంట్ ఎన్ని కల్లో బీఆర్ఎస్, బీజేపీకి సపోర్ట్ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
