
కాకా ప్రజల మనిషి అని.. నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఆలోచించారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన కాకా వెంకటస్వామి 96 జయంతి ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్న ఆయన.. పేద పిల్లలకు విద్యనందించేందుకు కాకా పరితపించారని అన్నారు.
కాకా బాటలో నడుస్తూ ప్రజాసేవ చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా పేద పిల్లలను చదివిస్తున్నామని తెలిపారు. కాకా సింగరేణి సంస్థను కాపాడి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడారు. అన్నపూర్ణ క్యాంటీన్లను తీసుకొచ్చింది కాకా అని గుర్తు చేశారు.
కింది స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన మహానేత కాకా అని అన్నారు. ప్రజలతో ప్రతినిత్యం మమేకం అయ్యారని తెలిపారు. ప్రైవేటు రంగంలో కూడా పెన్షన్లు ఇప్పించేందుకు కృషి చేశారని చెప్పారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సాగర్ పార్కులో కాకా విగ్రహం దగ్గర కాకా వెంకటస్వామి 96 జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్, సరోజా వివేక్, సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ కాకా చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాకా అభిమానులు . ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.