హైదరాబాద్, వెలుగు : మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు. మంచిర్యాల, చెన్నూర్, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, దుప్పట్లు, చీరలు, స్వెటర్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి సీఎం ఎ. రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
రామగుండంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించగా, మందమర్రిలో మున్సిపల్ కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేశారు. ఆటో యూనియన్ సభ్యులు కూడా జన్మదిన వేడుకల్లో పాల్గొని కార్మికుల సంక్షేమం కోసం మంత్రి చేస్తున్న కృషిని అభినందించారు. ఓయూ విద్యార్థి సంఘం సభ్యులు.. ఢిల్లీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను కేసుల నుంచి రక్షించడంలో వివేక్ పాత్ర కీలకం అని కొనియాడారు. అలాగే చెన్నూరులో కార్యకర్తలు, నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి దుప్పట్లు పంపిణీ చేశారు. ముస్లిం, క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు.
మంచిర్యాలలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ... కాకా స్ఫూర్తితో డాక్టర్ వివేక్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మందమర్రి, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, చెన్నూర్ ప్రాంతాల ప్రజలు.. మంత్రి మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే చెన్నూర్ పట్టణానికి చెందిన ఉదయ్కుమార్, చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన జనగామ పవన్ కలిసి ఉత్తరప్రదేశ్కు చెందిన ఆర్టిస్ట్తో 50 కిలోల వడ్ల గింజలతో మంత్రి వివేక్ చిత్రపటాన్ని రూపొందించారు.
