
- ఆన్లైన్ ద్వారానే ఇసుకను సప్లయ్ చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఇసుక రవాణాలో అవినీతి, అక్రమాలు, మాఫియాను సహించం
- కాళేశ్వరంతో లక్ష కోట్ల ప్రజా సొమ్మును కేసీఆర్ వృథా చేసిండు
- చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోల్బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. తాను మైనింగ్ శాఖ మంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఇసుక దందా ఆపాలని, ఆన్లైన్ ద్వారానే ఇసుక సప్లై చేయాలని ఆదేశించానన్నారు. ఎవరు ఇసుక దందా చేసినా ఊరుకునేది లేదని, క్రిమినల్ కేసులు పెడ్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీ, భీమారం, జైపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ప్రోసీడింగ్స్ అందించారు.
మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో డిపెండెంట్ ఉద్యోగులకు జాయినింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుకను ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమ ఇసుక దందా సాగిందని ఆరోపించారు. ఒకవైపు, ఇసుక దాందాలు చేస్తున్న వ్యక్తులు రూ.కోట్లు సంపాదిస్తుంటే.. ప్రజలకు ఇసుక ధరలు భారంగా మారాయన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో దందాలు, అవినీతి, అక్రమాలు, మాఫియాను సహించేది లేదని హెచ్చరించారు.
కాళేశ్వరంతో చెన్నూరుకు బొట్టు నీళ్లు రాలె..
కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, ప్రజల సొమ్మును వృథా చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ప్రాజెక్టు వల్ల చెన్నూరు నియోజకవర్గానికి బొట్టు నీళ్లు రాలేదన్నారు. ‘‘రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ప్రాజెక్టు కూలిపోవడంతో మూడేండ్లుగా నియోజకవర్గానికి బొట్టు నీళ్లు రాలేదు. ప్రాజెక్టు లేకున్నా.. పెద్ద ఎత్తున పంటలు పండించాం. కానీ బ్యాక్ వాటర్ వల్ల నియోజకవర్గంలో 40 వేల ఎకరాలు ముంపునకు గురై రైతులు నష్టపోగా, కాళేశ్వరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి మాత్రం ప్రపంచంలోనే ధనవంతుడయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు
కట్టుకుంది”అని అన్నారు.
క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయించ..
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.40 కోట్లతో, చెన్నూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో తాగు నీటి కోసం అమృత్ స్కీం నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనుల కోసం సర్కార్ రూ.30 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్న టైమ్లో క్యాతనపల్లి, రామగుండంలో రెండు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయించానని గుర్తుచేశారు. తాను చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి భూమిని సేకరించి, పరిహారం ఇప్పించానన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తాను దగ్గరుండి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయించామని తెలిపారు.
కొత్త బొగ్గు గనులతోనే సింగరేణికి భవిష్యత్తు..
సింగరేణిలో బొగ్గు గనులు మూతపడటం ఆందోళన కలిగిస్తోందని, కొత్త బొగ్గు గనులు వస్తేనే సంస్థకు భవిష్యత్తు ఉంటుందని వివేక్ అన్నారు. అప్పట్లో నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను మూసివేసే క్రమంలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో మాట్లాడి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి, సంస్థను కాపాడి లక్ష మంది ఉద్యోగులకు బాసటగా నిలిచారని గుర్తుచేశారు.
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అభివృద్ధి చేయకపోగా, సంస్థ నిధులను వాడుకుందని ఆరోపించారు. సంస్థకు కొత్త బొగ్గు గనుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టెండర్ల విధానంలో సింగరేణి పాల్గొని, గనులు దక్కించుకోవాలని సూచించారు. బొగ్గు గనుల టెండర్లలో సింగరేణి సంస్థ పాల్గొంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని వెల్లడించారు.
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..
చెన్నూరులో రూ.34 లక్షలతో అభివృద్ధి పనులు, భీమారం మండల కేంద్రంలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు డార్మిటరీ గదుల నిర్మాణం, క్యాతనపల్లి మున్సిపాలిటీలో చిల్డ్రర్న్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నిర్మించిన మెట్ల దారి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. భీమారం, జైపూర్ మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ అందజేశారు.
చెన్నూరు మండలం సుబ్బరాంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే, రైతు భరోసా సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. మందమర్రి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో దివంగత అసోసియేట్ ప్రొఫెసర్ జి.లింగయ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించారు. అంతకు ముందు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.