విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, న్యాయ అవగాహన పెరగాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, న్యాయ అవగాహన పెరగాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో విద్వత 2025 లా ఫెస్ట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇవాళ్టి ( అక్టోబర్ 13 ) నుంచి 16వ తేదీ వరకు జరగనున్న లా ఫెస్టివల్ ను ప్రారంభించారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. నేటి న్యాయరంగంలో సాంకేతికత విపరీతంగా పెరిగిందని.. ఇప్పుడు ChatGPT వాడి న్యాయపరమైన పత్రాలు రాయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చని అన్నారు. టెక్నాలజీ తో పాటు  హ్యుమానిటీ ఉండాలని.. ఎందుకంటే హ్యుమానిటీ లేకపోతే దీర్ఘకాలం ఏ రంగంలో నిలబడలేమని అన్నారు మంత్రి వివేక్.

1990లలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు 2020లలో పూర్తిగా మారిపోయాయని... న్యాయరంగంలో కూడా న్యాయమూర్తుల దృక్పథం, న్యాయవాదుల వైఖరి మారుతోందని అన్నారు. మనం కూడా వాటికి అనుగుణంగా మారాలని అన్నారు మంత్రి వివేక్. నేను స్వయంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ ని.. 5 లక్షల పెట్టుబడితో ప్రారంభించి, 2 వేల కోట్ల వ్యాపారం వరకు తీసుకువచ్చానని అన్నారు. ఇది సాధ్యమైంది కేవలం కష్టపడి, నిజాయితీగా పనిచేయడం వల్లే అని అన్నారు మంత్రి వివేక్. 

నేను మెడిసిన్ డాక్టర్, ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు.. అయినా కానీ కామన్ సెన్స్, కష్టపడి పనిచేయాలనే ఆసక్తి వల్లే సాధించగలిగానని అన్నారు.. ఏ రంగంలోనైనా విజయం కావాలంటే కష్టపడాలని, నిజాయితీగా ఉండాలని, మనుషుల సమస్యలు అర్థం చేసుకోవాలని అన్నారు.

అంబేద్కర్ కళాశాల ఈ సారి దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆహ్వానిస్తూ ఇలాంటి ఉత్సవం నిర్వహించడం గొప్ప విషయమని... కాకా కేవలం 10వ తరగతి చదివినవారు అయినా, పేదలకు విద్య అందించాలి, అవకాశాలు కల్పించాలి అన్న దృక్పథంతో ఉన్నారని అన్నారు. ఆ దృష్టిని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత అని అన్నారు మంత్రి వివేక్.ఈ కళాశాల 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ఒక గొప్ప ఆలోచన అని... ఇది పోటీని, కృషిని పెంచుతుందని అన్నారు మంత్రి వివేక్.

మా కుటుంబం కార్మిక ఉద్యమం నేపథ్యంతో ఉందని... నేను కార్మిక శాఖ మంత్రిగా కొత్త చట్టాలపై పనిచేశానని... ముఖ్యంగా గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ ఉండేలా ఒక చట్టం రాబోతోందని అన్నారు. అలాగే పదేళ్లుగా పెరగని కనీస వేతనాల వ్యవస్థను సరిచేయడం కూడా జరుగుతోందని అన్నారు మంత్రి వివేక్.