కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్‎లు కట్టిర్రు: మంత్రి వివేక్

కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్‎లు కట్టిర్రు: మంత్రి వివేక్

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్‎ నిర్మించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం (జనవరి 16) చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 కోట్ల రూపాయల TUIFDC ,CSR నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,2,7,8,9,12,13,14,17 వార్డులలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. 

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆనందంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన నిరంకుశ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‎లు, పెద్ద పెద్ద బిల్డింగ్‎లు కట్టారని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో 62 వేల కోట్ల రూపాయలు దండుకున్నారే తప్ప ఒక్క ఇంటికి చుక్క నీరు రావడం లేదని విమర్శించారు. 

రాష్ట్ర ఖాజానా ఖాళీ అయినప్పటికీ కూడా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారం లో ఉండి ఏం అభివృద్ధి చేసిందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చిన్నకొడుకు అని చెప్పుకునే బాల్క సుమన్ చెన్నూరు అభివృద్ధికి పాటు పడలేది.. కానీ ఇసుక దందా తో వందల కోట్లు సంపాదించాడని అన్నారు. తాను కమీషన్లు, దందాల కోసం ఎమ్మెల్యేగా రాలేదని.. ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు.

సోమనపల్లి గ్రామంలో 250 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరుమున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. చెన్నూరు నియోజక వర్గంలో రూ.100 కోట్లతో అమృత్ స్కీమ్ పథకం ద్వారా చెన్నూరు, మందమర్రి, క్యాతన పల్లి మున్సిపాలిటీలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని.. మరో ఆరు నెలలో ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పారు.