- కాంగ్రెస్ సభకు వచ్చిన జనాన్ని చూస్తే కేటీఆర్కు నిద్ర కూడా పట్టదు
- మంత్రులు పొన్నం, తుమ్మల
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, గత ప్రభుత్వం రూ.370 కోట్ల బకాయిలు పెడితే అధికారంలోకి రాగానే బకాయిలను విడుదల చేశామని మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ లీడర్లకు ప్రజలకు సేవ చేయాలన్న ఉత్సాహం ఉందని, వారికి ఓటేసి ఆశీర్వదించాలన్నారు.
కాంగ్రెస్ మీటింగ్ లకు వస్తున్న జనాన్ని చూస్తే కేటీఆర్ కు నిద్ర కూడా పట్టదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో ఓడిపోతామన్న భయంతో మూడు రోజులుగా ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ సిరిసిల్లకు చేసిందేమీలేదన్నారు. సిరిసిల్ల నేతన్నలకు దాదాపు రూ.1000 కోట్లు ఇచ్చామని, పాత బకాయిలు విడుదలతో పాటు కొత్తగా మరో రూ.350 కోట్లతో ఇందిరమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నాయకులు ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి.. జోడెడ్లుగా ప్రజలకు కోసం పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
