భోపాల్ : ఓ అత్యాచార బాధితురాలు దారుణానికి పాల్పడింది. తనకు పుట్టిన బిడ్డను తన చేతులతోనే చంపేసుకుంది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో చోటు చేసుకుంది. 15 ఏండ్ల వయసున్న ఓ అమ్మాయికి స్థానికంగా ఉన్న అబ్బాయి(17)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని అనువుగా చేసుకున్న అతను.. ఆ బాలికపై ఫిబ్రవరిలో అత్యాచారం చేశాడు. ఆగస్టులో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. ఆమె గర్భిణి అని వైద్యులు తేల్చారు. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జువైనల్ హోంకు తరలించారు.
అయితే బాధిత బాలిక అక్టోబర్ 16న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను నవంబర్ 5వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అత్యాచారానికి గురై బిడ్డకు జన్మనివ్వడం పట్ల బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో ఆ బాధను తట్టుకోలేక తన 40 రోజుల పసికందును గొంతు నులిమి చంపేసింది. అనారోగ్యం కారణంగా బిడ్డ చనిపోయిందని నమ్మించేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ పోస్టుమార్టం నిర్వహించడంతో గొంతు నుమిలి చంపినట్లు తేలింది.